Sunday, 4 December 2016

రాత్రికిరాత్రి కోటీశ్వరులు!

నిత్యం పేదరికంతో సతమతమయ్యే వారికి ఉన్నఫళంగా కోట్ల రూపాయలు వచ్చిపడితే ఎలా ఉంటుందో చూడాలంటే ఓసారి స్పెయిన్‌లోని ‘సెరిజేల్‌ డెల్‌ కాండెడో’ అనే ఓ చిన్న పల్లెటూరికి వెళ్లి రావాలి. ఈ మధ్య రాత్రికి రాత్రి వూళ్లొ ఉన్న ప్రతి ఒక్కరికీ పదిహేడు కోట్ల రూపాయలు వచ్చాయి మరి. అలాగని వాళ్ల భూముల్లో బంగారం పడటమో, లేదా ఏ ప్రైవేటు సంస్థో వూరు మొత్తాన్నీ కొనేయడమో జరగలేదు. ఓ వ్యక్తి దాతృత్వం వల్ల మారిన రాత అది. ఆంటోనినో ఫెర్నాండేజ్‌ అనే వ్యక్తి స్పెయిన్‌లో ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థకు యజమాని. అతడి తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేకపోవడంతో పద్నాలుగేళ్ల వయసులోనే బడికి వెళ్లడం మానేసిన ఆంటోనినో, బీర్‌ల తయారీ పరిశ్రమలో ఉద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టి, తరవాత వేల కోట్లు విలువ చేసే ‘కరోనా’ సంస్థను నెలకొల్పే స్థాయికి ఎదిగారు. ఆయన చివరి రోజుల్లో ఉండగా-పుట్టి పెరిగిన వూళ్లొ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడం, చాలామంది పిల్లలు డబ్బుల్లేక చదువుకి దూరమవుతుండటం చూసి కలతచెందారు. దాంతో తన తదనంతరం ఆస్తిలో సింహ భాగం ఆ గ్రామ వాసులకే చెందాలని ఆయన వీలునామా రాశారు. అలా ఈ ఏడాది ఆగస్టులో ఆంటోనినో చనిపోయాక గ్రామంలోని దాదాపు నూటయాభై కుటుంబాల వారు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. నడమంత్రపు సిరితో కళ్లు నెత్తికెక్కకుండా ఆయన లక్ష్యాలకు అనుగుణంగానే డబ్బుని ఖర్చు చేస్తాం అంటున్నారు ఆ గ్రామస్థులు. అదే జరిగితే ఆయనకు అంతకంటే మంచి నివాళి ఏముంటుంది..

No comments:

Post a Comment