Tuesday, 6 December 2016

మోదీదే పైచేయి టైమ్‌ ‘ఈ ఏటి మేటి వ్యక్తి’ అంతర్జాల సర్వేలో అగ్రస్థానం ట్రంప్‌, ఒబామా, పుతిన్‌లను తోసిరాజని ఘనత

దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ప్రఖ్యాత టైమ్‌ వార్తాసంస్థ ‘ఈ ఏటి మేటి వ్యక్తి’ అంతర్జాల సర్వేలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకులైన అమెరికా తదుపరి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లను తోసిరాజని ఈ సంచలనం సృష్టించారు. ఆదివారం రాత్రి సర్వే ముగిసేనాటికి మోదీ ఖాతాలో 18 శాతం ఓట్లు పడ్డాయి. మోదీకి సమీప ప్రత్యర్థులైన ఒబామా, ట్రంప్‌, వికీలిక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే లాంటి ప్రముఖులకు ఏడు శాతం ఓట్లే రావడం గమనార్హం. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ (2 శాతం) జాబితాలో వెనుకపడినట్లు కనిపిస్తున్నారు. ఈ సర్వేలో తుది విజేతను ఈ వారాంతంలో టైమ్‌ సంపాదకులు ప్రకటిస్తారు. ప్రపంచ ప్రజల్లో ప్రముఖులకున్న ఆదరాభిమానాలు దీనిలో ప్రతిబింబిస్తున్నట్లు టైమ్‌ తెలిపింది.
ఇది రెండోసారి: టైమ్‌ అంతర్జాల సర్వేలో మోదీ అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి. 2014లోనూ ఆయన 16 శాతం కంటే ఎక్కువ ఓట్లనే సంపాదించారు. గతేడాది ఈ సర్వేలో జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ విజయం సాధించారు. ప్రస్తుతం భారత్‌తోపాటు అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీలోని ఓటర్లు మోదీ వెనుక నిలిచినట్లు కనిపిస్తోందని విశ్లేషకుడు అపెస్టోర్‌ చెప్పారు.
మంత్రుల ప్రశంసల జల్లు: తాజా విజయంపై మోదీ మీద కేంద్ర మంత్రులు ప్రశంసల జల్లు కురిపించారు. ‘మోదీ ఈ ఏటికి మాత్రమే కాదు.. ఈ దశాబ్దానికే మేటి వ్యక్తి’అని జల వనరుల మంత్రి ఉమా భారతి హర్షం వ్యక్తంచేశారు. మోదీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం విమర్శలు గుప్పించారు.

No comments:

Post a Comment