పోరాట ఫలాన్ని దయ్యాలకు ఇస్తారా?
ఇందుకేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది?
కాంగ్రెస్ అడుక్కుంటే మేమే నాలుగు సీట్లు ఇచ్చేటోళ్లం
తెలంగాణ రాక్షసి చంద్రబాబుతో పొత్తా?
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ను ఖతం చేయాలి
అసెంబ్లీ రద్దు చేయమని సవాల్ చేశారు
ఇప్పుడేమో ఎన్నికలు వద్దని గోడలు గీకుతున్నారు
మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛన్ల పెంపు
ప్రభుత్వోద్యోగులకు భవిష్యత్తులో మంచి పెంపుదల
ప్రజలందరికీ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు
ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాల నమోదు
నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
చంద్రబాబుతో కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దయ్యాలకు అప్పగిస్తారా? తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే కాంగ్రెస్కు మేమే నాలుగు సీట్లు ఇస్తాం కదా. కరెంటు ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి 36 లేఖలు రాసిన దుర్మార్గుడు. మన పవర్ ప్లాంటు, ఏడు మండలాలను గుంజుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం రూ.500 కోట్లు ఇస్తాడట. మూడు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నాడట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్న తెలంగాణను అమరావతికి పంపిస్తారా? మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా?
కాంగ్రెసోళ్ల నిర్ణయం ఇక్కడేమైనా ఉంటుందా. అంతా దిల్లీలోనే. మూత్రానికి వెళ్లాలన్నా అక్కడే అడగాలి. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. దిల్లీకి గులాం గిరీ వద్దని చెబుతున్నా. ఈ దుర్గార్గులకు బుద్ధి చెప్పాలి
కొట్లాడి, అమరులు ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబునాయుడు చేతుల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ మహాకూటమిపై, చంద్రబాబు, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగారు. తెలంగాణ పోరాట యోధుల గుండెల్లో తూటాలు దింపిన కాంగ్రెస్, తెదేపాలు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ తాకట్టు పెట్టడానికి పూనుకున్నాయని ఆరోపించారు. చిల్లర రాజకీయాల కోసం దుర్మార్గుడైన చంద్రబాబుతో దోస్తీ కలిశారని కాంగ్రెస్పై మండిపడ్డారు. తెలంగాణ కార్మికులను గుర్రాలతో తొక్కించి, తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకుండా, నీళ్లు రాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్న చంద్రబాబుతో ఎలా కలిశారని నిలదీశారు. కాంగ్రెస్ అడుక్కుంటే తామే నాలుగు సీట్లు ఇచ్చేవారమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సవాలు మేరకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు. ప్రతిపక్షాలుఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేక కోర్టుల్లో కేసులు వేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. రైతు సమన్వయ సమితులకు వేతనాలు ఇస్తామన్నారు.
ఇందూరులో ఇంతటి జనప్రభంజనాన్ని ఎప్పుడు చూడలేదు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగురవేయడంలో అగ్రభాగంలో ఉన్న జిల్లా నిజామాబాద్. రాష్ట్రం తెరాస చేతుల్లోనే ఉంటేనే బాగుంటుందని 2014లో మాకు అధికారం అప్పగించారు. మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర బడ్జెట్, ఆదాయం తెలియవు. కరెంటు, వ్యవసాయం, వలసలు, కరవు, ఎండిపోయిన ప్రాజెక్టులు, కూలిపోయిన కులవృత్తులు, చేనేత కార్మికుల ఆత్మహహత్యలు.. ఇలా అన్నీ సంక్షోభాలే. ఉద్యమ సమయంలో తెలంగాణలో సరిగా కరెంటు లేకపోతే మూడు తీగల్లో ఒకదానికి కాంగ్రెస్, మరోదానికి తెదేపా, ఇంకోదానికి కమ్యూనిస్టు జెండాలు కట్టమన్నాం. ఈ జెండాలన్నీ నేలకేసి కొట్టి గులాబీ జెండాను నెత్తినపెట్టుకోండి అన్నాను. మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. తెలంగాణ పరుగులు తీసింది. 24 గంటల కరెంటు వచ్చింది. కష్టాల నుంచి ఒకటి, ఒకటి గట్టెక్కిపోతున్నాం. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే మా లక్ష్యం. అడవులు, హైవేలు..ఇలా 12 వేల అడ్డంకులు దాటుకుంటా 1.50 లక్షల కిలోమీటర్ల పైపులైన్ వేశాం. ఇప్పటికే 1,690 గ్రామాలకు నీళ్లు చేరాయి. రెండు, మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు వస్తుంది.
* పింఛన్ల పెంపుదల
మేం రాకముందు తెలంగాణలో ముసలివాళ్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు అన్నమో రామచంద్రా అనేవారు. వారి బతుకులు బాగు చేయాలనుకున్నాం. రూ.42 వేల కోట్ల ఖర్చు చేశాం. పింఛను రూ.200 నుంచి రూ.వేయి చేశాం. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు 60, 70 ఇచ్చేవారు. ఇప్పుడు మేం వేయి ఇస్తుంటే రూ.2,000 ఇస్తామంటూ హర్రాజ్ (వేలం) పాట పాడినట్లు పాడుతున్నారు. మేం లేకపోతే జన్మలో అలా అనేవారు కాదు. మరి మేం 2200 ఇస్తామంటే వారేం చేస్తారో? పింఛను పెంచబోతున్నాం. ఎంత పెంచాలనేది ఎన్నికల ప్రణాళిక కమిటీ నిర్ణయించాక ప్రజలకు చెబుతాం. దవాఖానాలను మంచిగా చేసుకున్నాం. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సన్న బియ్యం ఇలా 452 కార్యక్రమాలను అమలు చేశాం. బీడీ కార్మికులకు పింఛన్లను ఈ జిల్లా నుంచే ప్రారంభించాం. మొత్తం కార్మికుల్లో 39 శాతం ఇక్కడే ఉన్నారు. వీరి గురించి ఎవరైనా ఆలోచించారా? మేం వచ్చాక నెలకు వేయి పింఛను ఇస్తుంటే చాలామంది సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ మా పెద్దకొడుకు అని ముసలివాళ్లు చెబుతున్నారు. వారి దీవెన ఎప్పటికీ ఉంటుంది.
ఉద్యోగులకు న్యాయం
గత ప్రభుత్వాల్లో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారు. ఒప్పంద ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించారు. మేం ఒప్పంద ఉద్యోగులకు మంచి వేతనాలిచ్చి గౌరవంగా బతికేలా చేశాం. మళ్లీ ఆశీర్వదిస్తే అంగన్వాడీలు, ఆశాలకు మంచి వేతనాలిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పిచ్చి ప్రేలాపనలు వద్దు. తెలంగాణ వచ్చినప్పుడు వారికి 43 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచాం. భవిష్యత్తులో మంచి పెంపుదల ఉంటుంది. వారు గాభరాపడొద్దు.
* అన్నదాతకు అండ
అన్నదాతకు అండగా నిలిచాం. ఎరువుల సమస్య పరిష్కరించాం. నీటితీరువా రద్దు చేశాం. రాయితీ పరికరాలు, యంత్రాలు ఇచ్చాం. నిజాంసాగర్కు నీరు కావాలంటే సింగూరు ప్రాజెక్టు నుంచి ఇచ్చాం. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్నాం. కాళేశ్వరం, ప్రాణహిత, సీతారామ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టులు పూర్తయితే లక్ష్యం చేరతాం. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం. కాళేశ్వరం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టి నీటిని తరలిస్తుంటే కాంగ్రెస్ నేతలు కళ్లప్పగించి చూశారు. సాగునీటి కోసం ఎక్కడైనా అన్ని పార్టీలు ఒక్కటవుతాయి. ఇక్కడ మేం ప్రాజెక్టులు చేపడితే అడ్డుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారు. వారికి మీరే శిక్ష వేయాలి. మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ రెండువేల కోట్ల బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. షాదీముబారక్, 204 మైనారిటీ గురుకులాలు, ఇతర అన్ని రకాలుగా సాయం అందిస్తున్నాం.
* మూడు కోట్ల మందికి కళ్లద్దాలు
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాం. కంటివెలుగు గతంలో ఎవరూ చేయని గొప్ప కార్యక్రమం. పేద, ధనిక తేడా లేకుండా పరీక్షలు చేసి, 44 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చాం. మూడు కోట్ల మందికి వస్తాయి. ఇదే తరహాలో గ్రామాలకు వచ్చి ప్రతి ఒక్కరికీ ముక్కు, చెవి, గొంతు పరీక్షలు చేస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యస్థితిపై నివేదిక తయారు చేయించి, కంప్యూటరీకరిస్తాం.
* కాంగ్రెస్, తెదేపాలు ఏం చేశాయి?
నాలుగేళ్లలో కాంగ్రెస్, తెదేపాలు ఏం చేశాయి? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? 1956లో తెలంగాణను విడ[గొట్టి ఏపీలో కలిపింది నెహ్రూ, 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపి ఉద్యమాన్ని అణచివేసింది ఇందిరాగాంధీ కాదా? కరెంటు కోతలు, కొరతలు, రైతు ఆత్మహత్యలతో పాటు అప్పుడు మన ఉద్యోగాలను వేరేవాళ్లు తన్నుకుపోయినా కాంగ్రెసోళ్లు అడగలేదు. గులాబీ జెండా వచ్చాకే అడగడం మొదలైంది. కిరణ్కుమార్రెడ్డి నిండు శాసనసభలో తెలంగాణను అవమానించారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి అంటే దద్దమ్మలు, సన్నాసులు, ఒక్కరంటే ఒక్కరు నోరు తెరవలేదు. ఏడాది కింద కాంగ్రెస్ నేతలు మీటింగు పెట్టుకున్నారు. ‘కేసీఆర్కు తెలిసినంత ఇతర ముఖ్యమంత్రులకు తెలియలేదు. అన్నీ చేసేస్తున్నారు. 24 గంటల కరెంటిచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామంటున్నారు. ఇలాగైతే మనకు ఓటు ఎవరు వేస్తారు’ అనుకొని కాళేశ్వరంపై కేసులు వేశారు. వారి హయాంలో కర్ణాటక, మహారాష్ట్రతో పంచాయితీలే. మేం వచ్చాక అందరినీ కలిశాం. మీరు బతకండి.. మమ్మల్ని బతకనీయండి అని ఒప్పందం చేసుకుని ముందుకెళ్లాం.
సవాల్ చేసి పారిపోయారు..
నేను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని హైదరాబాద్కు వచ్చాక ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 1975లోనే మేం ఒప్పందం చేసుకున్నాం అన్నారు. నేను అప్పట్లో సవాల్ చేశాను. ఉత్తమ్కుమార్రెడ్డి నువు మగబిడ్డవే అయితే.. అయ్యవ్వకే పుట్టి ఉంటే ఒప్పందం కాపీ తీసుకొని బేగంపేట విమానాశ్రయానికి రా. నువ్వు చెప్పేది నిజమే అయితే నేను రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేస్తానన్నాను. 2014లో అసెంబ్లీలో రెండేళ్లలో రెప్పపాటు కరెంటు పోకుండా చేస్తానంటే జానారెడ్డి.. అలా చేస్తే గులాబీ కండువా వేసుకొని ప్రచారం చేస్తామన్నారు. ఇప్పుడు తప్పించుకునే యత్నం చేస్తున్నారు.
* చంద్రబాబు దుర్మార్గుడు
రాష్ట్రంలో కుట్రలు, విషరాజకీయాలను చూస్తే బాధ కలుగుతోంది. మా పార్టీ మధ్యలోనే పోతుందన్న వారే ఆగమయిపోయారు. 1999లో బయటికి వచ్చి 2001లో పార్టీ స్థాపించినప్పటినుంచి పోరాడుతున్నాం. ఇప్పుడొక పద్ధతికి వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తోంది. తెలంగాణను నాశనం చేసి, ఇక్కడి యువతను ఎన్కౌంటర్లలో చంపిన తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? 14 ఏళ్లు ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న రాష్ట్రం అమరావతికి పోవాలా? ప్రజలే నిర్ణయించాలి. కాంగ్రెస్ ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడలేదు. జైపాల్రెడ్డి వరంగల్లో తెరాసపై తప్పుడు మాటలన్నారు. అప్పుడు నేను వరంగల్లో ప్రజలతో మాట్లాడాను. ఎవరిది తప్పయితే వారికి కర్రుకాల్చి వాత పెట్టండని కోరాను.సర్పంచుగా గెలవని మా అభ్యర్థిని 4.60 లక్షల మెజారిటీతో గెలిపించారు.
* ఊరేగుతారా?
చంద్రబాబు రూ.500 కోట్లు కాంగ్రెస్కు ఇచ్చి, మూడు హెలికాప్టర్లతో మన నెత్తిన ఊరేగిస్తాడట. ఇదేనా కావాల్సింది? ఏడుమండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ, బోధన్, డిచ్పల్లిల్లో 70, 80, 90 ఏళ్ల కిందట వచ్చినవారిని ఆంధ్రావారిగా చూడడం లేదు. ఇక్కడున్న వారు తాము ఆంధ్రా అనే భావం వదిలిపెట్టాలి.
* భాజపా ఎక్కడుంది?
భాజపా ఏడుస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ ఎక్కడుందో తెలియదు. ఇళ్ల కిరాయిల కడతామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తామన్నారు. ఈ డబ్బులిస్తే మేమే మీ ఇంటి కిరాయి కడతాం. కాంగ్రెస్ నేతలు వచ్చి మీ ఇంటికి గొర్రెలు పంపుతాం. మీ వీపు గోకుతాం అంటూ ఆశ పెడుతున్నారు. మోసపోతే ఇబ్బందులు పడతాం.
సీఎంను బట్టేబాజ్ అంటావా?
నేను మాట్లాడితే సీఎం అలా అంటున్నారని అంటారు. ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల మీటింగులో నన్ను బట్టేబాజ్ అని అన్నారు. సీఎంను పట్టుకొని అలా అంటారా? ఉద్యమంలో నిప్పులు చెరిగిన కేసీఆర్ ఇప్పుడు ఎవరినీ తిట్టడం లేదు. మొత్తబడ్డారా అంటున్నారు. అప్పడు ఉద్యమం, ఇప్పుడు సీఎంగా బాధ్యత, పద్ధతి, ప్రవర్తన తప్పనిసరి. ఇలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. నిజామాబాద్ నుంచి అది ప్రారంభం కావాలి. మొత్తం 9 సీట్లలో తెరాస జెండా ఎగురవేయాలి’’ అని సీఎం అన్నారు.
నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలపై పిట్టకథ చెప్పారు. ‘‘ఒక మేరాయన (దర్జీ) మిషన్ కుడుతుండగా సూది కిందపడిపోయింది. ఎంతసేపు వెతికినా దొరక్కపోయేసరికి దేవుడి దగ్గరకు వెళ్లి సూది దొరికితే కిలో చక్కెర నైవేద్యంగా పెడతానన్నాడు. ఇది విని భార్య ఏమయ్యా! పది పైసల సూది కోసం కిలో చక్కెర పెడతావా? అని నిలదీసింది. దానికి అతను ముందైతే సూది దొరకనీయి, ఆ తర్వాత చక్కెర ఇచ్చేది లేదు. దేవుడు మనల్నేమయినా అడుగుతాడా? అన్నాడు. కాంగ్రెస్ వాగ్దానాల తీరు ఇలాగే ఉంది.’’ అన్నారు.
మాటల తూటాలు పేల్చిన కేసీఆర్
ఈనాడు, నిజామాబాద్: నిజామాబాద్లో బుధవారం
కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల తెరాస అభ్యర్థులు పెద్దఎత్తున జనాన్ని సమీకరించడంతో సభా ప్రాంగణం నిండిపోయింది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. కొంగర్కలాన్, హుస్నాబాద్ సభల్లో మాట్లాడిన దానికి భిన్నంగా ప్రాసలు, పంచ్ డైలాగులతో సభికులను ఆకట్టుకున్నారు. మాటల తూటాలతో ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడిన విధానం ఉద్యమ కాలం నాటి ప్రసంగాలను తలపించింది. కేసీఆర్ ప్రసంగిస్తుండగా ప్రజలు ఉత్సాహంగా నినాదాలు చేశారు.
అభివృద్ధిని ఆశీర్వదించండి
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక తెరాస నాలుగేళ్ల పాలనలో జరిగిందని నిజామాబాద్ సభలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఎంతో అభివృద్ధి: కవిత, ఎంపీ
నాలుగేళ్ల పాలనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు అమలు చేశాం. కామారెడ్డి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన జిల్లా ఏర్పాటు చేశాం. ఉమ్మడి జిల్లాలో 365 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి పల్లెల్లో అభివృద్ధికి పునాదులు వేశాం.
ప్రగతి దిశగా..: సురేష్రెడ్డి, మాజీ స్పీకర్
దేశంలో గత 40 ఏళ్లలో ఏర్పాటయిన నూతన రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటే ప్రగతి దిశగా పయనిస్తోంది. తెరాస ప్రభుత్వ పనితీరే ఇందుకు కారణం.
అందరికీ సంక్షేమం: గణేశ్గుప్తా
తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అభివృద్ధిని ఆశ్వీరదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పల్లెలకు ప్రత్యేకంగా నిధులు: బాజిరెడ్డి
తెరాస ప్రభుత్వ పాలనలో ప్రతి పల్లెకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దేశంలో రైతన్నలకు 24 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసిన ఘనత మా ప్రభుత్వానిదే.
నిజాంసాగర్కు పూర్వవైభవం: షిండే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరందించే నిజాంసాగర్ నీరు చేరక వట్టిపోతోంది. దీనికి పూర్వవైభవం తేవాలంటే కాళేశ్వరం జలాశయం నుంచి శ్రీరాంసాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించాలి. దీనికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ప్రచారం ముమ్మరం చేయాలి
ఈనాడు, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. ప్రతి చోటా పార్టీ శ్రేణలన్నింటిని సమాయత్తపరిచి పకడ్బందీగా ప్రచారం నిర్వహించాలన్నారు. బుధవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్ హెలిప్యాడ్ వద్ద బస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, పార్టీ అభ్యర్థులు జీవన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, హన్మంతుషిండే, గంపగోవర్ధన్, ఏనుగు రవీందర్రెడ్డి, షకీల్, గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్లతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా సమస్యలను తెలుసుకున్నారు. సభకు భారీఎత్తున జనసమీకరణ జరిపారని వారిని, ఎంపీ కవితను అభినందించారు.
నల్గొండ సభ ఏర్పాట్లపై సమీక్ష
నిజామాబాద్ సభను ముగించుకొని బుధవారం రాత్రి తన నివాసానికి చేరుకున్న కేసీఆర్ గురువారం జరగనున్న నల్గొండ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డిలతో ఫోన్లో మాట్లాడారు. ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయని వారు తెలిపారు.
పోచారం లక్ష్మీపుత్రుడు
పోచారం శ్రీనివాస్రెడ్డి లక్షీ¨్మపుత్రుడు. గతంలో చాలామంది వ్యవసాయ మంత్రులు వచ్చారు. కానీ పోచారం మంత్రి అయ్యాక అద్భుతాలు జరిగాయి. ఆయన నిఖార్సైన రైతుబిడ్డ, ఆయన ద్వారా రూ.17 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేశాం. గత ప్రభుత్వ హయాంలోని ఎర్రజొన్న రైతుల బకాయిలు విడుదల చేశాం. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేది తెలంగాణ మాత్రమే. ఆరువేల ఎకరాలకు ఒక వ్యవసాయ సమూహాన్ని ఏర్పాటు చేసి, పర్యవేక్షణకు 2,638 మంది విస్తరణాధికారులను నియమించాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భూరికార్డుల ప్రక్షాళన చేశాం. రైతుబంధు కింద ఎకరానికి రూ.8 వేల సాయం ఇస్తున్నాం.
* గిలగిలలాడుతున్నారు
కాంగ్రెస్ పార్టీ బతుకు అంతా కేసులే. ఊ అంటే కేసు, మూత్రం పోస్తే కేసు. ఈ లొల్లి, సొల్లు పురాణం, వొర్రుడు ఎందుకు? ఎన్నికలకు పోదామని సవాలు చేశాం. దమ్ముంటే రద్దు చేయి అన్నారు.. వెంటనే సభ రద్దు చేశాను. అదయ్యాక గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలొద్దని గోడలు గోకుతున్నారు. సుప్రీంకోర్టులో, ఎన్నికల కమిషన్లో కేసులు వేశారు. మా పార్టీ పుట్టిన నాటి నుంచి పదవులను ఎడమకాలి చెప్పులాగా విసిరేశాం. 9 నెలల అధికారం త్యాగం చేశాం. మా లక్ష్యం ఒక్కటే. రాష్ట్రం అభివృద్ధిలో స్థిరత్వంతో మరింత గట్టిగా ముందుకుపోవాలి.
కడుపు, నోరు కట్టుకొని, అవినీతికి దూరంగా ఉండి పని చేయడం వల్లే తెలంగాణ ఈ రోజు ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది. వరుసగా నాలుగేళ్లపాటు 17.17 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 19.43 శాతంగా ఉంది. తెలంగాణ రాకముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రభుత్వానికి ఇసుకమీద వచ్చిన ఆదాయం రూ.9.56 కోట్లు. మేం వచ్చాక నాలుగేళ్లలో రూ.1,977 కోట్లు సాధించాం. అప్పట్లో దొంగల్లాగా దోచుకుతిన్నారు. మా ప్రభుత్వంలో పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం